ఖమ్మం నుంచి ప్రియాంక – కాంగ్రెస్ ఉత్తరాదిపై ఆశలు వదులుకున్నట్లేనా ?

తెలంగాణా రాష్ట్రం ఖమ్మం ఎంపి స్థానం నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీనే బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ రాష్ట్రంలోని 17 సీట్లలో ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ తప్ప మిగిలిన వాటికి కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఖమ్మం స్థానంపై తొలి నుంచీ చర్చ జరుగుతోంది. గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి తొలుత బలంగా ముందుకు వచ్చింది. సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ప్రియాంక పోటీకి రెడీ

అనూహ్యంగా మళ్లీ గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక పేరు తాజాగా ముందుకు వచ్చారు. ప్రియాంక పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయటం అనేది.. రాహుల్‌ పోటీ చేసే స్థానాలపై ఆధారపడే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. వయనాడ్‌ నుంచి సిటింగ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ ఇప్పటికే ఆ స్థానంలో నామినేషన్‌ వేశారు. వయనాడ్‌తోపాటు యూపీలోని అమేథీ నుంచి కూడా రాహుల్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఉత్తరాది, దక్షిణాది రెండింటి నుంచీ రాహుల్‌ పోటీ చేసినట్లవుతుంది. ప్రియాంకను కూడా ఇదే తరహాలో ఉత్తరాది, దక్షిణాదిల్లోని రెండు స్థానాల నుంచి బరిలో దించాలని.. యూపీలోని రారుబరేలీ, ఖమ్మంల నుంచి ఆమెను పోటీ చేయించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

ఉత్తరాదిలో ఆశల్లేక దక్షిణాదిలో పోటీ

ఒకవేళ రాహుల్‌ వయనాడ్‌కు మాత్రమే పరిమితమైతే.. ప్రియాంక యూపీలోని అమేధీ, రారుబరేలీల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ పడతారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. తద్వారా ఉత్తరాది నుంచి ప్రియాంక ప్రాతినిధ్యం వహిస్తే.. దక్షిణాది నుంచి రాహుల్‌ ప్రాతినిధ్యం ఉంటుందని పేర్కొన్నాయి. కానీ ఇద్దరూ రెండుచోట్ల పోటీ చేస్తున్నారు. యూపీలో గెలిచే అవకాశం లేకపోవడంతోనే దక్షిణాది వైపు చూస్తున్నారు. యూపీలో కాంగ్రెస్ పరిస్థితి రాను రాను ఘోరంగా మారుతోంది.

కాంగ్రెస్ లో ఖమ్మం సీటు కోసం భారీ పోటీ

ఈ సీటు నుంచి పార్టీ టికెట్‌ కోసం రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు పోటీ పడుతున్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేరళకు వెళ్లారు. ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గనేందుకు ఆయన వెళ్లారని చెబుతున్నా.. ఖమ్మం సీటు విషయమై ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకే వెళ్లారన్న ప్రచారమూ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఎవరికి ఇచ్చినా ఇతర నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం ఖాయం కావడంతో ప్రియాంకను బరిలోకి దించే ఆలోచన బెటరనుకుంటున్నారు.