ఈసీ చెప్పినట్లుగానే పెన్షన్ల పంపిణీ – కూటమి ప్రయత్నాలు సక్సెస్ !

ఒకటోతేదీనే అందరికీ పెన్షన్లు అందేలా చేయడానికి ఎన్డీఏ కూటమి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సామాజిక భద్రత పింఛను పొందే లబ్ధిదారులు పింఛన్‌ కోసం మండుటెండలో సచివాలయాలకు వెళ్లి, అక్కడ పడిగాపులు పడాల్సిన పనిలేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే పింఛన్‌ నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మే, జూన్‌ నెలలకు సంబంధించిన పింఛన్‌ను ప్రభుత్వం ఈ డైరెక్టు బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్‌ (డిబిటి) పద్ధతిలో పింఛనుదారులకు అందించబోతోంది.

బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇంటి వద్దనే పంపిణీ

బ్యాంకు ఖాతాలు లేవో.. వారందరికీ ఇంటి వద్దనే పింఛన్‌ పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని, పింఛను తీసుకోవటంలో వారు అసౌకర్యానికి గురి కాకూడదంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం పింఛను పంపిణీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. లబ్ధిదారులకు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన పింఛను డబ్బులు మే 1వ తేదీనే వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. అలాగే మే నెలకు సంబంధించిన పింఛను డబ్బులు జూన్‌ 1న జమవుతాయి. డిబిటి ద్వారా పింఛను డబ్బులు వస్తున్నాయో వారి వివరాలతో కూడిన జాబితా గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటుంది.

48 లక్షల మందికి బ్యాంకు ఖాతాల్లో జమ

రాష్ట్రంలో ప్రస్తుతం 65,49,864 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరంతా మే నెలలో పింఛను తీసుకోబోతున్నవారే. అయితే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ) లెక్కల ప్రకారం వీరిలో 48,92,503 మందికి మాత్రమే ఆధార్‌, బ్యాంకు ఖాతాతో మ్యాప్‌ అయి ఉంది. మే 1వ తేదీనే వీరికి డబ్బులు జమవనుండగా.. వారికి బ్యాంకు ఖాతాకు లింక్‌ అయిన ఫోన్‌ నెంబరుకు మెసెజ్‌ వస్తుంది. ఇక ఎవరికైతే బ్యాంకు ఖాతా లేదో/ లింక్‌ కాలేదో వారికి నేరుగా ఇంటికే వచ్చి పింఛను డబ్బులు అందజేస్తారు.

25 శాతం మందికి ఇంటి దగ్గరే పెన్షన్

అధికారిక డేటా ప్రకారం 16,57,361 మందికి అంటే 25.30 శాతం మందికి ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా మ్యాప్‌ కాలేదు. దీంతో వీరందరికీ ఇళ్ల దగ్గరే పింఛను అందించనున్నారు. మే 1న ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభమై.. మే 5వ తేదీ వరకు కొనసాగుతుంది. బ్యాంకు ఖాతాలు లేనివారి వివరాలు ఇప్పటికే సంబంధిత సచివాలయాల వద్ద యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎవరూ ఎండల్లో తిరగకుండా వృద్ధులకు సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు