ఎన్టీఆర్, అర్జున్ మధ్య ర్యాపో ఎప్పటి నుంచి.? మల్టీస్టారర్ ఉండబోతోందా.?

RRR తర్వాత టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హవా జోరందుకుంది. ఇద్దరు స్టార్స్ ని పెట్టి సినిమా తీస్తే… పాన్ ఇండియా లెవల్లో, అవసరం అయితే అంతర్జాతీయ స్థాయిలోనూ రిలీజ్ చేసుకోవచ్చనే ఆలోచన నిర్మాతల్లో కన్పిస్తుంది. ఇలాంటి సమయంలో… టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య థార్… అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో ఓ రేంజ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. మొదటగా ఈ సినిమా కోసం రణ్ వీర్ సింగ్, విక్కీ కౌశల్ పేర్లు అనుకున్నారు. అయితే వీరిద్దరికి దక్షిణాదిన అంత మార్కెట్ లేదు. దీంతో… ఇప్పుడు వారిద్దర్ని కాదని అల్లు అర్జున్, ఎన్టీఆర్ ని హీరోలుగా అనుకుంటున్నారట. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ కు, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో మార్కెట్ వచ్చింది. దీంతో… ఈ ఇద్దరు హీరోలైతేనే బెటర్ అని బాలీవుడ్ మేకర్స్ ఆలోచన.
అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ సాధ్యమేనా?
సాధారణంగా ఏ ఇద్దరు హీరోలకు పడదు. వారిద్దరూ స్టార్స్ అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి డైరెక్టర్ కాబట్టి… ప్రాజెక్టు ఫినిష్ అయ్యింది కానీ ఇంకో డైరెక్టర్ అయితే ఇద్దరు హీరోల్ని పెట్టి సినిమాను పూర్తి చేయలేకపోయేవాడు. అందులోనూ తారక్, చెర్రీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి… ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు తలెత్తలేదు. మరి ఎన్టీఆర్, చెర్రీ మధ్య ఏర్పడిన బాండింగ్ అల్లు అర్జున్, తారక్ మధ్య ఉందా అంటే అంతకుమించే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అసలు తారక్ కు చరణ్ ని పరిచయం చేసిందే అల్లు అర్జున్. ఇక ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య బాండింగ్ కూడా ఎప్పటినుంచో ఉంది. ఇద్దరూ బావా, బావా అని పిల్చుకుంటారు. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు తారక్. అంతటితో ఆగకుండా పార్టీ లేదా పుష్పా అంటూ కామెంట్ కూడా చేశాడు. దానికి బన్నీ కూడా రెడీ.. వస్తున్నా అని ట్వీట్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య అంతా బాండింగ్ ఉంది. గతంలోనూ వీరిద్దరూ కొరియోగ్రాఫర్స్ ని షేర్ చేసుకునేవారు. ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్స్ కాబట్టి… ఎవరైతే మంచి కొరియోగ్రాఫర్ ఉంటే ఒకరినొకరు రిఫర్ చేసుకునేవాళ్లు. శేఖర్, జానీ లాంటి కొరియోగ్రాఫర్లని ఇండస్ట్రీలో ఛాన్సులిచ్చి ప్రోత్సహించింది వీళ్లిద్దరూ. కాబట్టి.. వీరిద్దరూ కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులకు పూనకాలే.
ఇప్పట్లో లేనట్లే
అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ కోసం ప్లాన్స్ అయితే ఉన్నాయి కానీ సినిమా అయితే ఇప్పట్లో పట్టాలెక్కడం అసంభవం. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలి. ఎలా చూసినా ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వడానికి మూడేళ్లకు పైగా పడుతుంది. అటు ఎన్టీఆర్ కూడా నాన్ స్టాప్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ 2024 రిలీజ్. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తో సినిమా చెయ్యాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి అప్పటివరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.