నామినేషన్ల ఘట్టం షురూ – మే 13 అసలు వార్ !

ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టం నామినేషన్‌ స్వీకరణ ప్రారంభం అయింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీచేసే అభ్యర్థులు ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించొచ్చు. చివరిరోజు 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మూడు గంటలకు ఒక్క నిమిషం దాటినా ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు నామినేషన్‌ తీసుకోవడానికి అవకాశం ఉండదని అధికారులు ప్రకటించారు

ర్యాలీలు చేసుకోవచ్చు..కానీ లోపలికి ఐదుగురికే చాన్స్

నామినేషన్‌ల పరిశీ లన 26వ తేదీన జరుగుతుంది. 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఎన్నికల ప్రచారం మే 11 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 13 పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్లు సందర్భంగా ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు. 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రదర్శనలు నిలిపి వేయాలని, అభ్యర్థితో పాటు మరో నలుగురు మాత్రమే రిటర్నింగ్‌ అధికారి వద్దకు రావాలని నిబంధన విధించారు.

నామినేషన్ ధృవపత్రాలు కీలకం

నామినేషన్‌ పత్రాలతో పాటు 13 రకాల ధ్రువపత్రాలను జత చేయా లని ఎన్నికల కమిషన్‌ నిబంధన విధించింది. ప్రధానంగా నేర చరిత్రకు సంబంధించిన అన్ని ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను నామినేషనలలో పూర్తి వివరాలను పొందుపరచాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. దీంతో అభ్యర్థులంతా తమ రాజకీయ వ్యక్తిగత జీవితంలో నమోదైన కేసుల వివరాలను ఆయా పోలీస్‌ స్టేషన్‌ల నుంచి సేకరిస్తున్నారు. ఇందుకు అవసరమైన డాక్యు మెంట్స్‌ సమీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో తమపై నమోదైన కేసుల వివరాలు కూడా తెప్పించుకుంటున్నారు.

అభ్యర్థుల వ్యయంపై పూర్తి స్థాయి పరిశీలన

నామినేషన్‌ దాఖలు చేసిన రోజు నుంచి అభ్యర్థుల వ్యయ పరిశీలన, నమోదు జరుగుతుంది. పార్లమెంటరీ నియోజక వర్గం కోసం ఫారం-2ఎ, అసెంబ్లీ నియోజ కవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలి. సెలవు దినాలు మినహా పని దినాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వ్యయ పరిశీలకులు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. వ్యయం విషయంలో తేడా వస్తే అనర్హతా వేటు పడుతుంది.