ఓటు హక్కు లేదా ? ఇదే చివరి అవకాశం

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల సీజన్‌. పార్లమెంటుతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగా, మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడి, నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతుంది. మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకొనే సువర్ణావకాశం ఇది. ఈ మహాక్రతువులో మనం కూడా భాగస్వాములు కావాలంటే, కేవలం ఓటుహక్కును కలిగి ఉంటేచాలు.

రాతను మార్చే ఓటు

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది. అత్యంత విలువైన, అమూల్యమైన ఓటుహక్కును పొందడానికి ఇప్పటికీ అవకాశాన్ని కల్పిస్తోంది మన ఎన్నికల కమిషన్‌.దేశంలో 18 సంవత్సరాలు దాటిన భారత పౌరులందరికీ ఓటుహక్కు కల్పిస్తోంది మన రాజ్యాంగం. దీనికి దరఖాస్తు సమర్పించడం ఒక్కటే పౌరులు చేయాల్సిన పని. ఈ ఏడాది ఈ నెల ఒకటో తేదికి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు పొందే అవకాశాన్ని కల్పించారు. వీరంతా ఈ నెల 14వ తేదీలోపల దరఖాస్తు చేసుకోగలిగితే, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభిస్తుంది. ఆ తరువాత దరఖాస్తు చేసినా ఈ ఎన్నికల్లో ఓటు చేసే అవకాశం మాత్రం ఉండదు.

ఏప్రిల్ 14వ తేదీ వరకు చాన్స్

కొత్త ఓటు కోసం, లేదా చిరునామా మార్పు కోసం ఈ నెల 14వ తేదీలోపు వచ్చే దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తారు. వాటిని పదిరోజుల్లోగా పరిశీలించి, అర్హత ఉంటే ఓటర్ల జాబితాలో చేరుస్తారు. వీరికి మే 13న జరిగే ఎన్నికల్లో ఓటువేసే అవకాశం లభిస్తుంది. ఏప్రిల్‌ 14 తరువాత వచ్చే దరఖాస్తులను మాత్రం ఎన్నికల తరువాత మాత్రమే పరిశీలిస్తారు. వాస్తవానికి నామినేషన్లను దాఖలు చేసేవరకు ఓటు నమోదుకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. అయితే వచ్చిన వాటిని పరిశీలించి, జాబితాల్లో చేర్చడానికి పదిరోజుల సమయం పడుతుంది. కాబట్టి, దరఖాస్తు చేయడానికి చివరితేదీ ఏప్రిల్‌ 14గా నిర్ణయించారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి !

18 ఏళ్లు నిండినవారు ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌, ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా ఫారం-6లో దరఖాస్తు చేయాలి. చిరునామా, ఓటు బదిలీ మార్పు కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పదిరోజుల్లో పరిశీలన పూర్తిచేసి, నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా ఓటుహక్కు పొందినవారి పేర్లును అనుబంధ జాబితా ద్వారా, అలాగే చనిపోయినవారు, ఆబ్సెంటీస్‌, బదిలీ ఓటర్ల వివరాలను ఎఎస్‌డి జాబితాలో నమోదు చేసి, ఆయా పోలింగ్‌ కేంద్రాల ప్రిసైడింగ్‌ అధికారులకు అందజేస్తారు. ఇప్పటికే ఓటు కోసం దరఖాస్తు చేసి, ఓటుహక్కు పొందిన వారికి ఇప్పటికే ఓటరు గుర్తింపు కార్డులను పంపించారు.