జోరు పెంచిన నేహా శెట్టి, వరుస సినిమాలతో బిజీ!

నేహా శెట్టి అనేకన్నా డీజేటిల్లు రాధిక అంటే ఠక్కున గుర్తొస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ అంతే ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. లుక్ , నటన పరంగా నేహా శెట్టికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా డీజే టిల్లు. ఆ తర్వాత బిజీ అవుతుందనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా బ్రేక్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే జోరు పెంచింది…

సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాల్లో నేహా శెట్టి హీరోయిన్‌. అంతకు ముందు మెహబూబా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో నేహాశెట్టి ఎవరన్నది పెద్దగా తెలియలేదు. కానీ డీజే టిల్లుతో రాధికగా బాగా దగ్గరైంది. ఆ ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆ క్రేజ్ ని వెనువెంటనే వాడుకోవడంలో మాత్రం నేహా పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. రాధిక అక్క మళ్లీ ఎప్పుడొస్తావ్ అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. తాజాగా బెదురులంక 2012 సినిమాతో వచ్చిన నేహా మరో హిట్టందుకుంది. కార్తీకేయ హీరోగా నటించిన ఈ సినిమాపై థియేటర్లలో పాజిటివ్ టాక్ వచ్చింది. త్వరలో మరో రెండు ప్రాజెక్టులతో వచ్చేందుకు సిద్ధమైంది

ఊపేస్తున్న సమ్మోహనుడా సాంగ్
నెహా శెట్టి లేటెస్ట్ మూవీస్ లో త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా కిరణ్ అబ్బవరంతో కలసి నటిస్తోన్న ‘రూల్స్ రంజన్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘సమ్మోహనుడా’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఎక్కడ చూసినా, ఏ రీల్స్ చూసినా అందరికీ ఈ సాంగ్ ఫేవరెట్ అయిపోయింది. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక నేహా మరో సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన ఈ మూవీలోనూ రాధికకు మంచి పాత్రే లభించిందట. ఇందులో సాంగ్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గ్యాప్ రాలేదు ఇచ్చింది
డీజే టిల్లు తర్వాత గ్యాప్ రాలేదు..ఇచ్చాను అంటోంది రాధిక. ఓ సినిమాతో సక్సెస్ అందుకున్నాక ఆ తర్వాత నటించబోయే సినిమాలపై కూడా ప్రేక్షకులకు అవే అంచనాలుంటాయి..అందుకే కథల ఎంపికలో జాగ్రత్త అవసరం అంటోంది. అన్నట్టుగానే ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న బెదురులంక హిట్ టాక్ సొంతం చేసుకుంది. రూల్స్ రంజన్, గ్యాగ్స్ ఆఫ్ గోదావరి పైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూడు సినిమాలు హిట్టైతే నేహా జోరు పెరగడం ఖాయం. ఇప్పటికే టాలీవుడ్ లో పాతుకుపోయిన శ్రీలీల, సంయుక్త మీనన్ తర్వాత నేహా ఉంటుందేమో చూడాలి.