వైసీపీ మాజీ మంత్రికి టీడీపీలో ఎదురుగాలి వీస్తోందా ? – గుంతకల్లులో తాజా పరిస్థితి ఇదే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ స్థాయి విమర్శలు అసలు లెక్కలోకి రావడానికి గుమ్మనూరు జయరామే ఉదాహరణ. మంత్రిగా ఉన్నప్పుడు జయరాం ఏం చేశారో టీడీపీ నేతలు మర్చిపోయారు. తనపై టీడీపీ నేతలు ఏమని విమర్శలు చేశారో జయరాం మర్చిపోయారు.

ఎంపీ టిక్కెట్ వద్దనుకుని టీడీపీలో చేరిన జయం

కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చినా వద్దనుకున్న గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ లోకి వెళ్తారనుకున్నారు. కానీ కర్ణాటకలో మంత్రిగా ఉన్న తన సోదరుడు నాగేంద్ర సాయంతో లాబీయింగ్ చేసుకుని టీడీపీలో చేరిపోయారు. అయితే ఆయనకు ఆలూరు కాకుండా గుంతకల్లు టిక్కెట్ కేటాయించారు. అయితే గుంతకల్లు నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అవేమీ లెక్క చేయని గుమ్మనూరు జయరాం ఎన్నికలు నాటికి అందర్నీ ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇప్పటికీ సహకరించని టీడీపీ నేతలు

దీంతో నియోజకవర్గంలోని తిరేకలను,అసంతృప్తులను ఏకం చేసేందుకు జయరాం సోదరుడు నారాయణస్వామి, కుమారుడు ఈశ్వర్ రంగంలోకి దిగారు. మండలాల వారీగా నాయకులతో కలుస్తూ వ్యతిరేకులను అసంతృప్తులను కలిసి పార్టీకి పనిచేయాలని సూచించారు ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అసంతృప్తులను ఏకం చేసేందుకు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి రంగంలోకి దింపి జితేంద్ర గౌడ్ ను పార్టీ కోసం పనిచేయాలని ఆదేశించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత చంద్రబాబు నాయుడు జితేంద్ర గౌడ్ కి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే జయరాం గెలిస్తే ఇక తమకు నియోజకవర్గం ఉండదని వారు ఫీలవుతున్నారు.

బీసీ వర్గమే కాపాడాలి !

వాల్మీకి (బీసీ) సామాజిక వర్గంలో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నేతగా గుమ్మనూరు జయరాంకు పేరుంది. ఆలూరు నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో పిఆర్పి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున 2014,2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి సామాజిక వర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు. గుమ్మనూరు జయరాం ఇప్పుడు గుంతకల్లులో గట్టిపోటీ ఎదుర్కొంటున్నార మౌత్ టాక్ ప్రారంభమయింది. బీసీలంతా ఏకమైతే ఆయన గెలుపు ఖాయమన్న అభిప్రాయం ఉంది.