తండ్రిని ఓడించాలంటున్న కొడుకు – రోడ్డున పడ్డ అనకాపల్లి వైసీపీ అభ్యర్థి కుటుంబ రాజకీయం

ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ పై పోటీ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గం మాడుగుల సీటును కుమార్తెకు ఇప్పించుకున్నారు. అయితే ఆయన కుమారుడు తండ్రితో విబేధించారు. ఇప్పుడు తన తండ్రిని ఓడించాలని ఆయన ప్రచారం ప్రారంభించారు.

తండ్రిని ఓడించాలంటున్న బూడి రవి

ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్న కుమార్తె .. రెండో భార్య సంతానం. ఇప్పుడు ఓడించాలని పిలుపునిస్తు కుమారుడు మొదటి భార్య సంతానం. మొదటి భార్య సంతానంకు న్యాయం చేయకపోవడంతో ఆయన తండ్రికి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. కన్న కొడుక్కు న్యాయం చేయలేని వ్యక్తి ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓటర్లూ.. ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించండి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

జడ్పీటీసీగా కూడా అవకాశం ఇవ్వలేదన్న రవి

మా నాన్న తులసి మొక్కే కానీ 2019 తర్వాత ఆ మొక్కకి కొన్ని పురుగులు పట్టాయని అంటున్నారు. జగన్‌ని నమ్ముకుని ఆయన వెంట 9ఏళ్లు తిరిగాను కానీ ఏనాడు బూడి ముత్యాలనాయుడి కుమారుడిగా చెప్పుకోలేదన్నారు. ఏమైందో ఏమో కానీ ఐదేళ్లుగా నన్ను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారని రవికుమార్ అంటున్నారు. మాడుగుల నుంచి ఇండిపెండెంట్ గా కూడా రవికుమార్ పోటీకి నిలబడ్డారు. గతంలో కూడా జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయాలని రవి కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కానీ అప్పుడు కూడా బుజ్జగించి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేసి అదే స్థానం నుంచి రెండో భార్య కుమార్తె అనురాధను నిలబెట్టారు. ఇప్పుడు కూడా మాడుగుల నుంచి పోటీ చేయాలని, ఈసారి మాడుగుల టికెట్ తనకే అని ఎన్నో ఆశలు పెట్టుకున్న రవికుమార్‌కు తండ్రి షాకిచ్చారు. కుమార్తెకు చాన్సిచ్చారు.

కుమారుడ్ని దారికి తెచ్చుకోకపోతే ముత్యాలనాయుడికి కష్టమే.

మాడుగుగుల అనురాధకు పడే ఓట్లను చీల్చడంలో రవి కూమార్ కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని వారు వివరిస్తున్నారు. ఇది కూటమి అభ్యర్థికి ప్లస్‌గా మారుతుందని అనుమానిస్తున్నారు. అదే సమయంలో పార్లమెంట్ సీటులో కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.