అక్షయ తృతీయ రోజు ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

అక్షయ తృతీయ హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు దాదాపు ఆలయాలు అన్నింటిలో ప్రత్యేక పూజలు జరుగుతాయి కానీ కొన్ని ఆలయాలు మరింత ప్రత్యేకం…

బదరీనాథ్
ఉత్తరాది దివ్యక్షేత్రమైన బదరీనాథ్ ఆలయం విశిష్టమైనది. ఏటా చలికాలంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఆరు నెలల పాటు బదరీనాథుడిని దేవతలు పూజిస్తారని విశ్వాసం. అందుకు సాక్ష్యంగా లోపల అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది..పూలు వాడిపోకుండా ఉంటాయి. ఈ ఆలయం ఏటా అక్షయ తృతీయ సమీపంలోనే తెరుస్తారు. బదరీనాథ్ సమీపంలో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలైతే అక్షయతృతీయనాడే తిరిగి తెరుస్తారు.

సింహాచలం
సింహాచలంలోని వరాహ లక్ష్మీ నారసింహస్వామివారిని శాంతింపచేసేందుకు చందనాన్ని లేపనం చేస్తారు. ఇదే చందనోత్సవం. ఏటా అక్షయ తృతీయ రోజు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఒక్క రోజు మాత్రమే స్వామివారి నిజరూపాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది.

పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథుని పేరు వినగానే రథయాత్ర గుర్తుకు వస్తుంది. ఏటా ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రని చూసేందుకు లక్షలాది భక్తులు పూరీకి చేరుకుంటారు. ఈ రథయాత్ర కోసం రథాల నిర్మాణం అక్షయ తృతీయ రోజు మొదలవుతుంది. ఆలయ పూజారుల నేతృత్వంలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుంగలకి ఈ రోజు పూజ చేసి రథనిర్మాణాన్ని ఆరంభిస్తారు.

కుంభకోణం
తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న 12 వైష్ణవాలయాలలోని ఉత్సవమూర్తులు గరుడవాహనం మీద బయల్దేరతారే రోజు అక్షయతృతీయ. ఇలా ఒకే రోజున 12 ఆలయాల నుంచి ఊరేగింపుగా వచ్చే మూర్తులను చూసేందుకు భక్తులు పోటెత్తుతారు.

బృందావనం
శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైన బృందావనంలో ‘బంకే బిహారి’ అనే ఒక ఆలయం ఉంది. బృందావనంలోని ప్రముఖ ఆలయాలలో ఇదీ ఒకటి. స్వామి హరిదాస్ నిర్మించిన ఈ ఆలయంలో మూలవిరాట్టుగా ఉన్న గోపాలుని పాదాలని దర్శించే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..