పేరు బీఆర్ఎస్‌ చేసేది ప్రాంతీయ రాజకీయం – కేసీఆర్, కేటీఆర్‌లకు ఎన్ని తిప్పలో !

టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మార్చింది.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడంపై కనీస ఆలోచన చేయడం లేదు. తెలంగాణ వాదమే వినిపిస్తామని చెబుతున్నాు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ను పేరుకే జాతీయ పార్టీగా ఉంచేసి..కనీసం ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీఆర్ఎస్ అని పేరు మార్పుతోనే టీఆర్ఎస్‌కు గండం

అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక్కో ప్రచార సభలో ఒక్కో రీతిగా తెలంగాణ వాదాన్ని మళ్లీ రగిలించేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రయత్నించారు. తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకున్న వైనం మర్చిపోయినట్లుగా నటించి జాతీయ పార్టీలను నమ్మొద్దని జాతీయ పార్టీలు తెలంగాణ ఆత్మ కాదని, బీఆరెస్ మాత్రమే తెలంగాణ ప్రజల ప్రతీక అని, ఢిల్లీ గులామ్‌లు మనకు వద్దంటూ ఎన్నికల్లో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించారు. దేశంలో రాబోయే రోజులన్ని ప్రాంతీయ పార్టీలవేనని, ఢిల్లీలో హంగ్‌ వస్తే ప్రాంతీయ పార్టీలేకింగ్‌ మేకర్‌ అన్నారు.అయితే ప్రజలు బలంగా మార్పు కోరుకోవడంతో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ వల్లె వేసిన తెలంగాణ సెంటిమెంట్ పనిచేయలేదు. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు.

వందల కోట్ల ప్రజాధనంతో ఇచ్చిన ప్రకటలన్నీ వృధా

బీఆరెస్‌ జాతీయ పార్టీగా రూపాంతరం చెందాక తాను దేశమంతా తిరిగి గాయి గత్తర లేపుతా.. ప్రధాని పీఠం ఎందుకు రాదో చూస్తానని ప్రకటనలు చేశారు. కేసీఆర్‌ మహారాష్ట్రకు వెళ్లి పార్టీ విస్తరణ ప్రయత్నాలు గట్టిగానే చేశారు. పంజాబ్‌, ఢిల్లీ, బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి సీఎంలను కలిసి హడావుడి చేశారు. కర్ణాటకలో జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో, యూపీలో అఖిలేశ్‌తో చెట్టాపట్టాలేసుకున్నా ఇప్పుడు వారు కూడా ముఖం చేశారు. రైతు ఉద్యమంలో మృతి చెందిన పంజాబ్‌ రైతులకు, గల్వాన్‌ పోరులోని అమరుల కుటుంబాలకు చెక్కులిచ్చారు. ప్రకటనలు జాతీయ స్థాయిలో ఇచ్చారు. జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్‌ ఎన్నిరకాల ఫీట్లు వేసినా.. ఆయన కలసిన సీఎంలు అంతా ఇండియా కూటమికే జై కొట్టారు. ఇప్పుడు తెలంగాణలోనే బీఆరెస్‌ అధికారం కోల్పోవడంతో ఇక కేసీఆర్‌ పార్టీ వంక చూసే వారే కరువయ్యారు.

బీఆర్ఎస్‌కు భవిషత్ ఉంటుందా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి బీఆరెస్ ఎన్నికల్లో ఉనికి కోసం ఆరాటం.. పోరాటం చేస్తున్నా.. బీఆరెస్‌కు లోక్‌సభ ఎన్నికలు పెను సవాల్‌గా తయారవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర-రాష్ట్రాల్లోని అధికార జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లను కాదని ప్రజలు బీఆరెస్‌కు ఓటేయడం కష్టంగానే కనిపిస్తున్నది. బీఆరెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాలను గమనిస్తే గతం కంటే భారీగా సీట్లు తగ్గిపోతాయని అర్థమవుతున్నది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో కూడా కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే మాటేమోగానీ సొంత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా ారింది.