చిలుకూరు బాలాజీని దర్శించుకుంటే తిరుమల వెళ్లినట్టేనా!

భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది చిలుకూరు బాలాజీ దేవాలయం. హైదరాబాద్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కొలువైన స్వామిని దర్శించుకునేందుకు కేవలం తెలుగురాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు. వీసాల బాలాజీ సన్నిధిలో శుక్ర, శనివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇంతకీ చిలుకూరు బాలాజీని దర్శించుకుంటే తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నట్టే అని చెప్పెందుకు ఓ కథ ప్రచారంలో ఉంది…

చిలుకూరు బాలాజీ స్థల పురాణం
సుమారు 500 ఏళ్ల కిత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి స్వస్థలం చిలుకూరు. ఎంత కష్టమైనా కానీ ఏడాదికి ఓసారి కాలినడకన తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడు. అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో స్వామివారు కనిపించి…‘మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే. నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా వెలికి తీసి గుడి నిర్మించు’ అని చెప్పి అంతర్థానమయ్యాడు. నిద్రనుంచి మేల్కొన్న మాధవరెడ్డి తిరిగి చిలుకూరు చేరుకుని ఈ విషయాన్ని స్థానికులకు చెప్పాడు. అక్కడున్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన విగ్రహానికి అక్కడే గుడి నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. 1963లో ‘రాజ్యలక్ష్మి’ అమ్మవారిని ప్రతిష్ఠించారు. పూలంగి, అన్నకోట, బ్రహ్మోత్సవాలను ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

హుండీ ఉండదు
ఈ దేవాలయానికి నాలుగేళ్ల కిందట స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎలాంటి హుండీ ఉండదు. భక్తులు ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే బ్యాంక్ ఖాతాలో జమచేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రత్యేక పూజలంటూ ఏమీ ఉండవు. ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామిని అలంకరించి పూజ చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక్కడ భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. వీఐపీ దర్శనాలు, ప్రత్యేకపూజ టికెట్‌ వంటివేవీ లేవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలనూ ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.