ముసుగు తీసిన తెలంగాణ కాంగ్రెస్ – మజ్లిస్‌తో కలిసిపోయినట్లే !

మజ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. సెక్రటేరియట్‌కు అక్బరుద్దీన్ సారధ్యంలో వచ్చిన ఎమ్మెల్యేలు.. పలు అంశాలపై చర్చించారు. పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లుగా చెబుతున్నారు. కానీ అసలు విషయం రెండు పార్టీలు ఒకటేనని సందేశం పంపడం. బొటాబొటి మెజార్టీతో ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరిగా మజ్లిస్ నిలుస్తుందని చెప్పడం.

ప్రొటెం స్పీకర్ గా నిబంధనలకు విరుద్ధంగా అక్బరుద్దీన్ ఎంపిక

ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ను ప్రభుత్వం ఎంపిక చేసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఇతర సీనియర్లు ఉన్నప్పటికీ ఆయననే ఎంపిక చేసుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజార్టీ ఉండటం వల్ల మజ్లిస్ తో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. కారణం ఏమైనప్పటికీ అక్బరుద్దీన్ రెండు, మూడు రోజుల్లోనే తన ఎమ్మెల్యేలందరితో కలిసి రేవంత్ రెడ్డితో సమావేశం కావడం బీజేపీ ఆరోపణల్ని నిజం చేసినట్లు అయింది.

కాంగ్రెస్‌తో మజ్లిస్ స్నేహం లౌకికత్వానికి దూరం కావడమే

కాంగ్రెస్ పార్టీతో చాలా కాలంగా మజ్లిస్ విబేధిస్తోందని ప్రచారం చేసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ముస్లిం ఓట్లను చీల్చి.. కాంగ్రెస్ ఓటమికి కారణం అవుతోందని ఆరోపిస్తూ వస్తున్న ారు. కానీ తెలంగాణలోనూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మజ్లిస్ రాజకీయం చేయలేదు. కాంగ్రెస్ కు ముస్లిం ఓటు బ్యాంక్ భారీగా బదిలీ అయిందని రాజకీయ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. మజ్లిస్ కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లుగా ప్రకటించింది. కానీ అసలు విషయం మాత్రం కాంగ్రెస్‌కు లోపాయికారీ మద్దతు. ఇలా చేయడం లౌకిక వాదంపై స్పీచులు దంచే కాంగ్రెస్‌ డబుల్ స్టాండర్డ్స్ ను బయట పెడుతుందన్న విమర్శలు రావడానికి కారణం అవుతోంది.

అధికారం ఎక్కడ ఉంటే మజ్లిస్ అక్కడ

అయితే మజ్లిస్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటుంది. అధికార పార్టీలతో గొడవలు పెట్టుకోవాలనుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాత విషయాలు మర్చిపోయి.. మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజార్టీ కంటే.. మూడు సీట్లే ఎక్కువగా ఉన్నాయి. అందుకే్ మజ్లిస్ కు చెందిన ఏడుగురు బలం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ప్రభుత్వం వైపు ఉంటారన్న సందేశం పంపితే చాలన్నట్లుగా కాంగ్రెస్ భావిస్తోంది. ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించిడమేనని ఎక్కువ మంది భావిస్తున్నారు.