ఇలాగైతే బొత్సపై గెలుస్తారా ? – చీపురుపల్లి టీడీపీలో అదే వర్గ పోరాటం !

చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బొత్సను ఢీ కొట్టేందుకు కళా వెంకట్రావుకు చంద్రబాబు చాన్సిచ్చారు. కానీ అక్కడ ఐదేళ్లుగా పని చేసుకుంటున్న కిమిడి నాగార్జున అసంతృప్తికి గురయ్యారు. ఆయన శాయశక్తులా అటు మంత్రి బొత్స సత్యన్నారాయణను, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ను, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ని ఎదుర్కొని పోరాటాలు చేశారు. అయినా టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్రంగా బరిలోకి దిగాలనుకుంటున్నారు.

మాజీ మంత్రి కుమారుడు నాగార్జున

2014లో కిమిడి మృణాలిని ఇక్కడ నుండి పోటీ చేసి బొత్స సత్యన్నారాయణపై గెలుపొంది మంత్రిగా పని చేశారు. 2019లో ఆమె కుమారుడైన కిమిడి నాగార్జునకి టిడిపి చీపురపల్లి టిక్కెట్‌ ఇచ్చింది. అప్పుడు పోటీ చేసిన నాగార్జున బొత్స సత్యన్నారాయణపై ఓడిపోయారు. అయినప్పటికి తన వెంట ఉన్న ఏ ఒక్క కార్యకర్తనూ టిడిపి నుండి ప్రత్యర్ధి పార్టీవైపు చూడకుండా వారి కష్టసుఖాలలో అహర్నిసలు అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడ్డారు. నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తకు కష్టం వచ్చినా తానున్నానంటూ వారికి అండగా నాగార్జున నిలబడ్డాడు. దీంతో నాగార్జున పై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ నుండి నాగార్జునిని కాదని అనేక పేర్లుని అదిష్టానం ప్రతిపాదనలోనికి తీసుకురావడంతో నాగార్జున మనస్తాపానకి గురైయ్యాడు. నాగార్జునతో సంప్రదించకుండా కిమిడి కళావెంకటరావుకి చీపురుపల్లి అసెంబ్లీ టిక్కెట్‌ ప్రకటించింది.

పోటీ చేసేందుకే నాగార్జున ఏర్పాట్లు

తాను ఎంటి పరిస్థితులలోనూ పోటీలో ఉంటానని తన అనుచర వర్గంతో చెబుతున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగా ఈ నెల 18 లేదా 20వ తేదీలలో చీపురుపల్లి అసెంబ్లీ నుండి నామినేషన్‌ వేయనున్నట్లు నాగార్జున కార్యకర్తల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అందుకు సిధ్దంగా ఉండాలని కార్యకర్తలకు, అభిమానులకు సూచించినట్లు సమాచారం. న కిమిడి కళావెంకటరావు ఇప్పటి వరకు నాగార్జునుని కలవడం గానీ, కనీసం ఫోన్‌ కూడా చేయలేదని నాగార్జున వర్గం చెబుతున్నారు. అదిష్టానం ఇంత చెబుతున్నప్పటికీ కళావెంకటరావు వ్యవహార శైలి భిన్నంగా ఉండడంతో టిడిపి కేడర్‌లో, నాయకులలోనూ ఒకింత అసహనానికి తావిస్తోంది .

సోదరుడి కుమారుడే అయినా నాగార్జునను కలుపుకోని కళా వెంకట్రావు

నాగార్జునను ఎందుకు కలుపుకు పోవడంలేదన్న ప్రశ్న కళావెంకటరావుకు వస్తోంది. నాలుగు మండలాలలో జరిగిన కార్యకర్తల సమావేశాలలో కూడా కళావెంకటరావుతో సంబంధిత నాయకులు బహిరంగంగానే నాగార్జునుని కలుపుకొని పోవాలని లేదంటే గెలుపు కష్టమవుతుందని చెబుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా కళావెంకటరావు ఒంటెద్ది పోకడతో ముందుకు వెలుతున్నట్లు కొంతమంది నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.