బీజేపీ హయాంలోనే ఉచిత రేషన్..

కాంగ్రెస్ పార్టీ తరచూ సోషలిస్టు వ్యవస్థపై గంటల కొద్ది ఉపన్యాసాలిస్తుంది. అందరికీ సమన్యాయం కల్పిస్తానని డాంబికాలు పలుకుతుంది. సంపద పంపిణీ అంటూ కాంగ్రెస్ షహజాదా రాహుల్ గాంధీ కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. దీనిపై విమర్శలు వస్తున్నా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేకపోతోంది. అయితే ఇందంతా ఆ పార్టీ నాటకమని పేదల పట్ల కాంగ్రెస్ కు అక్కర లేదని అనేక ఉదంతాలు నిరూపించాయి. పేదలకు ఇచ్చే రేషన్ విషయంలోనూ కాంగ్రెస్ ద్వంద్వ నీతిని, దొంగనీతినే ప్రదర్శిస్తోంది…..

నాడు మన్నోహన్ సింగ్ చెప్పిందే…

పేదలు బతకాలంటే ఏదోక రూపంలో వారికి ఆహార పదార్థాలు అందాలి. అందులో ఉచిత రేషన్ కూడా ఒకటని ఒప్పుకోక తప్పదు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మాత్రం ఉచిత రేషన్ కుదరదని అధికారికంగా ప్రకటించేసింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని సుప్రీం కోర్టు స్వయంగా ప్రకటిస్తే..అది తమ వల్ల కాదని 2010 సెప్టెంబర్ 6న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. పైగా విధానాల రూపకల్పనలో సుప్రీం కోర్టు జోక్యం తగదని ఆయన అన్నారు. అందుకే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే పేదల కడుపు కొట్టడం ఖాయమని బీజేపీ ఆరోపిస్తోంది.

అదనపు ఆహార ధాన్యాలను పంచితే తప్పేమిటి…

సుప్రీం కోర్టు చెప్పిందొకటి. కాంగ్రెస్ పార్టీ దాన్ని వక్రీకరించిందీ మరోకటని అర్థం చేసుకోవాలి. అదనపు ఆహార ధాన్యాలను పేదలకు పంచితే తప్పేమిటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆ అంశాన్ని అప్పటి వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కూడా తప్పుపట్టారు. సుప్రీం కోర్టు సలహా ఇచ్చిందే తప్ప, ఆదేశాలివ్వలేదని కొత్త భాష్యం చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే కోర్టు ఆయనకు మొట్టికాయలేసింది. అది ముమ్మాటికి ఉత్తర్వేనని తేల్చిచెప్పింది. దేశంలో 37 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని అప్పట్లో అంగీకరించిన మన్మోహన్ ప్రభుత్వం వారి కడుపు నింపేందుకు మాత్రం ముందుకురాలేదు…

మోదీ హయాంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్

మోదీ అధికారానికి వచ్చిన తర్వాత 80 కోట్ల మంది..ఖచితంగా చెప్పాలంటే 81 కోట్ల 30 లక్షల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇచ్చే ఉచిత రేషన్ వల్ల ఐదేళ్లలో ప్రభుత్వ ఖజానాకు రూ. 11.8 లక్షల కోట్లు ఖర్చవుతోంది.ఐనా సరే పేదల సంక్షేమం కోసం ఆ మాత్రం ఖర్చును భరిస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించి చాలా రోజులైంది. కాంగ్రెస్ హాయంలో ఆహార ధాన్యాలు గోదాముల్లో మురిగిపోయి పాడైపోతుంటే..ఇప్పుడు మోదీ పాలనలో వాటిని పేదలకు పంచి ఆకలి తీర్చుతున్నారు. సామాన్యుల పట్ల బీజేపీకి ప్రేమ ఉందని చెప్పేందుకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏమి కావాలి…