తెలంగాణ ప్రభుత్వ మనుగడపై అప్పుడే అనుమానాలు – ఎందుకిలా ?

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదన్న ప్రచారం ప్రారంభమయింది. పార్టీ కార్యకర్తలంతా ఒక్క ఏడాది ఓపిక పట్టాలని, ఏడాదిలోపే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటు అవుతుందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి సంతాప సభలో ఈ కామెంట్స్ చేశారు. గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా గందరగోళంలో ఉన్నారన్న ఆయన తమ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందో కూడా చెప్పారు.

బీఆర్ఎస్ లెక్కలు బీఆర్ఎస్ వే

గులాబీ పార్టీకి 39 సీట్లు వచ్చాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతు ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న కమలం పార్టీని కలుపుకొని, మరికొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదన్నారు కడియం శ్రీహరి. ఏడాది వరకు ఓపిక పడితే పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారన్న ఆయన, సింహం తిరిగి వస్తుందన్నారు. బీఆర్ఎస్‌కు మంచి రోజులు వస్తాయన్న కడియం, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందున తగాదాలు కొని తెచ్చుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరూ భయపడనవసరం లేదని, ఆరు నెలలా.. సంవత్సరమా, రెండేళ్లా, మూడేళ్లా, మళ్లీ ప్రభుత్వం మనదే.. మన ముఖ్యమంత్రి కేసీఆరేనని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నుంచి ఫోన్లు వస్తున్నాయన్న కేటీఆర్

తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోయిందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరనే నిరాశలో కాంగ్రెస్ ఓటర్లు ఉన్నారని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. గత మూడు రోజులనుంచి ఇలాంటి సందేశాలు, వీడియోలు వస్తున్నాయని కార్యకర్తలకు వివరించారు. కాంగ్రెస్ నేతలు నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయని అన్నారు. ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదని, బాధ్యతాయుత విపక్షంగా పనిచేద్దామని అన్నారు. తెలంగాణ ప్రజలు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారన్న కేటీఆర్.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం వారితో కలిసి పోరాడుతామని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం తమను వదులుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు.అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అన్నింటినీ తెలంగాణ ప్రజలు రాసిపెట్టుకున్నారన్న కేటీఆర్ చెప్పారు.

బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న రాజాసింగ్

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏడాదికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్న ఆయన, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందన్నారు రాజాసింగ్. ఇలా కీలకమైన నేతలంతా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేస్తుండటంతో అసలు ఏం సందేశం ఇస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటీ మార్కులతో పాస్ అయింది. అంటే 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డిని సీఎంగా చేయడం కాంగ్రెస్‌లో ఉన్న ఓ వర్గం ఎమ్మెల్యేలకు ఇష్టం లేదనే చర్చ కూడా నడుస్తోంది. ఇటు విపక్షాలు అదే మాట చెప్పకనే చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో అసంతృప్తులను మేనేజ్ చేసుకుంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.