ఈ పర్యాటక ప్రాంతాలు అద్భుతంగా ఉంటాయి కానీ సందర్శనకు వెళితేమాత్రం అంతే!

భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. సీజనల్ గా చూసేవి కొన్ని, అన్ సీజన్లోనూ సందర్శించగలిగేవి కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే పర్యాటక ప్రాంతాలు మాత్రం చెప్పకునేందుకు బావుంటాయి కానీ సందర్శించాలనే ఆశతో వెళితే రిస్కే. అందుకే ఈ ప్రాంతాల్లో పర్యటనని నిషేధించారు. అలాంటి కొన్ని ప్రదేశాలేంటో చూద్దాం.

చంబల్ నది
మధ్యప్రదేశ్ లోని చంబల్ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నదీతీర ప్రాంతంలో ఉండే మనోహరమైన దృశ్యాలు చూసేందుకు సందర్శుకుల ఎగబడతారు. బాలీవుడ్ లో చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయి. అందంగా ఈ ప్రదేశాన్ని చూడాలని ముచ్చపడితే మాత్రం అక్కడుండే బందిపోటు దొంగలు ఆ సరదా తీర్చేస్తారు. అందుకే ఇక్కడకు సందర్శకులు పెద్దగా వెళ్లరు.

బస్తర్
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ చిత్రకూట్ వంటి పర్యాటక ప్రదేశాన్ని ఇండియన్ నయాగరా జలపాతాలుగా పిలుస్తారు. అయితే ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మొగ్గుచూపరు.

సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్
సుందరమైన ప్రదేశాల్లో కేరళ ఫస్ట్ ఉంటుంది. అందుకే దీనిని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఒకప్పుడు సందర్శకులతో కళకళలాడేది. కానీ ఓసారి మావోయిస్టుల దాడి జరగడంతో అప్పటి నుంచీ ఈ పార్క్ ని సందర్శించేవారి సంఖ్య అలా తగ్గిపోయింది.

మానస్ నేషనల్ పార్క్
అస్సాంలో ఉన్న అందమైన ప్రదేశం మానస్ నేషనల్ పార్క్ . ఈ పార్క్‌ని దేశంలోని ఎంతో అందమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా పిలుస్తారు. 2011లో బోడో ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఆరుగురు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అధికారులను కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి తగ్గింది.

బారెన్ ద్వీపం
అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బారెన్ ద్వీపంలో అగ్నిపర్వతం ఉంది. ఈ ప్రాంతం పెద్దగా ఉనికిలో లేకపోయినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చే దట్టమైన పొగను, ఎర్రని లావాలను చూడాలనుకుంటే చిన్న షిప్‌లో భద్రతా ప్రమాణాలతో వెళ్లి పరిమిత దూరం నుంచి చూడవచ్చు. కానీ ఆ సాహసం చేసేవారి సంఖ్య తక్కువే.

అక్సాయ్ చిన్
అక్సాయ్ చిన్ ఈ ప్రదేశాన్ని కూడా టూరిస్టులు చూసేందుకు వీలులేదట. ఇది ప్రపంచంలో ఎంత సుందరమైన ప్రదేశమో అంతే ప్రమాదకరమైన ప్రదేశం. లడాఖ్‌ పర్వత శిఖరాల మధ్య ఉంటుంది ఈ ప్రాంతం.

నికోబార్ ద్వీపం
అండమాన్ లో పర్యటించినట్టగా నికోబార్ దీవుల్లో పర్యాటకులు ప్రవేశించేందుకు ఛాన్స్ ఉండదు. ఇక గిరిజన సమూహాలు ఉండే ప్రాంతాల్లో అయితే అస్సలు అనుమతించరు. ప్రత్యేక పాస్‌లు ఉంటేనే పర్యాటకులు, విదేశీయులు ద్వీపంలో పర్యటించవచ్చు.

గమనిక: ఈ కథనం ద్వారా పర్యాటకులను నిరుత్సాహపరచాలనే ఉద్దేశం లేదు. కేవలం అవగాహన కోసం మాత్రమే ఇస్తున్నాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది మీ వ్యక్తిగతం