బీజేపీ కూటమిలోకి వచ్చినప్పుడే విజయం – ఏపీ ఫలితాలు చెప్పింది ఇదే

చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన రికార్డే లేదు.. ఈ సారి ఆయన ఘోరంగా ఓడిపోతారు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో జోస్యం చెప్పారు. చంద్రబాబు దురదృష్టం ఏమిటో కానీ ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా పరాజయం పాలయ్యారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు కూడా పరాజయం పాలయ్యారు అది వేరే విషయం. కానీ బీజేపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా గెలిచారు.

కూటమిగా ఏర్పడటమే టీడీపీకి కీలకం

గత ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు ఈ సారి బీజేపీ, జనసేనతో పొత్తులు పెట్టుకోడమే కాదు…ఓట్లు ఈజీగా ట్రాన్స్ ఫర్ అయ్యే వాతావరణం తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే మూడు పార్టీలు ప్రతిపక్షంగానే ఉన్నప్పటికీ భిన్నమైన అభిప్రాయాలతో పోరాడాయి. ఎన్నికలకు ఏడాది ముందు జనసేన పార్టీ ఓట్ల చీలిక జరగనివ్వబోమని చెబుతూ ముందుకు వచ్చినప్పటి నుండి పరిస్థితి మారింది. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య దూషణలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక బీజేపీ పూర్తిగా వేరే ట్రాక్‌లో ఉండేది. ఆ పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఉండేవారు. అందుకే ఆ పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్నది పెద్ద పజిల్ గా ఉండేది.

స్మూత్‌గా ఓట్ల బదిలీ జరిగేలా వ్యూహం

ఏపీలో ఎన్డీఏ కూటమి ఓట్ల బదిలీ జరిగితేనే మంచి ఫలితాలు సాధిస్తుందని మూడు పార్టీల నేతలకూ తెలుసు. బీజేపీ ఆరు లోక్ సభ స్థానాల్లో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. జనసేన రెండు పార్లమెంట్, ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశాయి. టీడీపీ 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ చోటా మూడు పార్టీలపై ఓటర్లలో స్పష్టమన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో గాజు గ్లాస్ గుర్తు గందరగోళం కూడా వచ్చింది. కానీ ఒక్క సారి ప్రచారం ప్రారంభించిన తర్వాత ఎలాంటి సమస్యలు కనిపించలేదు. స్మూత్ గా ప్రచారం చేసుకుపోయారు. మూడు పార్టీల మధ్య వివాదాలు సృష్టించాలని వైసీపీ వైపు నుంచి కొన్ని వ్యూహాలు అమలయ్యాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం విషయంలో అనేక పుకార్లు కూడా రేపారు. అయితే ఏదీ నిలబడలేదు. అంతా సాఫీగా సాగిపోయింది.

కసితో పని చేసిన కూటమి పార్టీలు

కోస్తా జిల్లాల్లో ఓట్ల బదిలీ ఎంత పర్ ఫెక్ట్ గా జరిగింతో ఫలితాలు చూస్తే అర్థమైపోతుంది. ఎంత బాగా కలసిపోతే అంత బాగా ఫలితాలు వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రచారం ఉమ్మడిగా సాగింది. ప్రతి మూడు రోజులకు ఓ సారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి సభల్లో పాల్గొన్నారు. కూటమిలో ఏ గుర్తుకు ఓటు వేసినా తమ అభిమాన పార్టీకి వేసినట్లే అన్న అభిప్రాయాన్ని వంద శాతం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పాటు మూడు సభలు, ఓ రోడ్ షోలో పాల్గొన్నారు. పార్టీలు పూర్తిగా కలసిపోయాయన్న గట్టి నమ్మకాన్ని ఓటర్లలో కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ప్రచారం పూర్తయ్యే సరికి అన్ని పార్టీల కార్యకర్తలు పూర్తి స్థాయిలో కలిసిపోయారు. బరిలో ఉన్నది తమ పార్టీ అభ్యర్థా కాదా అన్నది చూసులేదు.. కూటమి అభ్యర్థి కోసం పోటీ పడాలన్నదే లక్ష్యంగా పని చేశారు. అనుకున్న ఫలితం సాధించారు.