పంచకర్ల రమేష్ బాబు ఏ పార్టీలోకి – ఏపీలో ఆ కూటమి వైపే చూస్తున్నారా ?

ఎన్నికల ముందు విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్‌బాబు రాజీనామా చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్‌ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలో పార్టీ విజయం సాధించాలంటే భారీ మార్పులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలాంటి పరిస్థితి వైసీపీలో లేదని వాపోయారు. పెయిల్యూర్‌ లీడర్‌గా ఉండేందుకు తాను సిద్ధంగా లేనని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

టిక్కెట్ లేదని చెప్పేసిన వైసీపీ హైకమాండ్

పార్టీలో ఎలాంటి పనులు చేయాలన్నా తనకు స్వేచ్ఛ లేదన్నారు పంచకర్ల రమేష్‌బాబు. విశాఖ పార్టీలో ఉన్న సమస్యలు చెబుదామని ఎంతగా ప్రయత్నించినా పార్టీ అధ్యక్షుడు జగన్ దృష్టికి తీసుకెళ్లలేకపోయానన్నారు. ఏ నియోజకవర్గంలో సమస్యలు గురించి ప్రస్తావించినా ఇంఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి ఆ స్థానిక ఎమ్మెల్యేలకు అనుకూలంగా మాట్లాడతారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖలో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలంటే వైఎస్‌ఆర్‌సీపీలో ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడ్డారు పంచకర్ల రమేష్‌బాబు. కఠిన నిర్ణయాలు అవసరమని అన్నారు. ఇలా అందర్నీ సమర్థించుకుంటూ పోతే ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అందుకే పార్టీని వీడుతున్నట్టు లెటర్‌లో పేర్కొన్నారు. అయితే పెందుర్తి టిక్కెట్ ఆశించిన ఆయనకు హైకమాండ్ హ్యాండివ్వడంతో పార్టీకి గుడ్ బై చెప్పారని అంటున్నారు.

బీజేపీ -జనసేన కూటమి వైపు చూపు

వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్‌బాబు జనసేన- బీజేపీ కూటమి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. పంచకర్ల రమేష్‌బాబు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పెందుర్తి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పు కారణంగా టీడీపీలో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై 2014లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి యలమంచిలి నుంచి పోటీ చేశారు. 2019 కూడా టీడీపీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మూడేళ్ల క్రితం వైఎస్‌ఆర్‌సీపీ కండువా కప్పుకున్నారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన – బీజేపీ కూటమి బలంగా నిలబడుతుందని నమ్ముతున్న ఆయన రెండుపార్టీల్లో ఒకదానిలో చేరే అవకాశాలు ఉన్నాయి.

పొత్తులపై ఏపీలో వస్తున్న క్లారిటీ

పవన్ కల్యాణ్.. తాను బీజేపీతోనే ఉన్నానని చెబుతున్నారు. బీజేపీ కూడా అదే చెబుతోంది. టీడీపీ మాత్రం తాము ఎవరితో కలుస్తామన్నది చెప్పడం లేదు. జనసేన అధినేత ఇటీవల స్వరం మార్చారు. పూర్తి స్థాయి అధ్యయనం తర్వాతనే నిర్ణయమంటున్నారు. దీంతో ఎక్కువ మంది పార్టీ మారాలనుకుటున్న నేతలు.. జనసేన, బీజేపీ వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు.