స్నానానికి కూడా సమయం, కొన్ని నియమాలు ఉంటాయి!

మనిషి జీవితంలో స్నానం అనేది నిత్య ప్రక్రియ. పొద్దున్నే ఇదో పనిలా కాకుండా దానికో పద్ధతి ఫాలో అవ్వాలంటారు పండితులు. ముఖ్యంగా స్నానం చేసే సమయం, స్త్రీ పురుషులు ఎలా స్నానం చేయాలో చెబుతూ కొన్ని నియమాలు చెప్పారు . అవేంటో చూద్దాం…

కనీసం అరగంట
స్నానం అంటే గబుక్కున వెళ్లి నాలుగు మగ్గుల నీళ్లు దిమ్మరించుకుని వచ్చేయడం కాదు కనీసం అరగంటైనా చేయాలట. ఈ ఉరకల పరుగుల జీవితంలో అంత సమయం కేటాయించడం కష్టమే కానీ ఆరోగ్యానికి, మనసుకి మంచిది అన్నప్పుడు ఓ అరగంట ముందులేచి ఆ సమయాన్ని స్నానానికి కేటాయిస్తే తప్పేముంది. ముందుగా నాలుగు మగ్గుల నీళ్లతో శరీరం మొత్తం తడిసేలా పోసుకోవాలి. ఆ తర్వాత సున్నితంగా వళ్లంతా రుద్దుకుని మళ్లీ పోసుకోవాలి

స్నానంలో రకాలు 4

ఋషి స్నానం: ప్రభాతవేళ 4, 5 గంటమధ్య చేసే స్నానం

దైవ స్నానం: ఉదయం 5,6 గంటల మధ్య చేసేది

మానవ స్నానం: ఉదయం 6,7 గంటల మధ్య చేసేది

రాక్షస స్నానం : ఆ తరువాత చేసేది

‘స్త్రీ’ , పురుషులు ఎలా స్నానం చేయాలి
స్త్రీ స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. ఒంటి మీద నూలు పోగు లేకుండా చేయాలి. స్నానం అయిన తరువాత ముందు ముఖాన్నీ ఆ తర్వాత వక్షస్థలాన్ని తుడుచుకున్నాక ఒళ్లంతా తడి ఆరేలా తుడుచుకోవాలి. స్నానం చేసిన వెంటనే చూపుడు వేలుని ఉపయోగించకుండా బొట్టుపెట్టుకోవాలి.
అయితే మగవారు మొండి మొలతో స్నానం చేయరాదని శాస్త్రం చెబుతోంది.

ఏ స్నానం శ్రేష్టం
అన్ని స్నానాల కన్నా సముద్రస్నానం శ్రేష్టం. ఎందుకంటే ఉప్పు నీటి వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. రెండోది నదీ స్నానం. వేకువజామున నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయని చెబుతారు. నదీ జలాలు కొండలు, చెట్లును తాకుడూ ప్రవహిస్తూ ఎన్నో వనమూలికలను తనతో పాటూ తీసుకొస్తుంది. అందుకే నదీ స్నానం ఆరోగ్యానికి ఉత్తమమైనదని చెబుతారు. ఇక చివరిది ఇంటి స్నానం. అతి వేడి నీటితోగానీ, అతి చల్లటి నీటితోగానీ స్నానం చేయకూడదు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే శరీరానికి, శరీరం లోపల వున్న అవయవాలకి మంచిదంటారు.

రాత్రి స్నానమూ మంచిదే
స్నానం చేసే సమయం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటారు. సహజంగా అందరం ఉదయం స్నానం చేస్తుంటాం. అయితే రాత్రుళ్లు కూడా చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిది. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో రాత్రి పూట స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. రోజంతా రకరాల పనుల్లో ఉండటం వల్ల రాత్రి స్నానం చేస్తే ఒత్తిడి దూరమవుతుందంటారు.

ఏ సమయంలో స్నానం చేయరాదు
కొంత మంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తుంటారు. కానీ ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదు. ఆయుర్వేదం ప్రకారం ఆహారం తీసుకున్న తర్వాత దాదాపు 2 గంటల పాటు స్నానం చేయకూడదు. ఇక నిద్రకు, స్నానానికి మధ్య కాస్త సమయం ఉండేలా చూసుకోవాలంటారు. స్నానం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించడం కూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్యవిషయం ఏంటంటే ఎక్కువ సార్లు స్నానం కూడా అస్సలు మంచిది కాదట.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం