కేరళలో ద్వాదశ శివాలయాల్లో ఈ ఆలయం చాలా ప్రత్యేకం!

దక్షిణ భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రముఖ శివాలాయల్లో తాలిపరాంబాలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది కేరళ రాష్ట్రం కన్నూర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే.. రాత్రి 7.15 నిమిషాల తర్వాతే మహిళలకు ప్రవేశం ఉంటుంది.

పురాతన కేరళలో పరశురాముడు స్థాపించిన 64 బ్రాహ్మణ గ్రామాల్లో తాలిపరాంబా ఒకటి. అందరికీ ఈ ప్రాంతం నివసించడానికి శ్రేయస్సు గా ఉండడంతో బ్రాహ్మణులంతా ఇక్కడే ఉండేవారు. ఈ ప్రాంతాన్ని లక్ష్మీపురం అనికూడా పిలిచేవారు. పరశురాముడు సృష్టించిన కేరళలోని 108 శివాలయాలలో (గోకర్ణం నుంచి కన్యాకుమారి వరకు పురాతన కేరళ) తాలిపరంబా ఒకటి. ఈ దేవాలయాల్లో 12 చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. వీటినే ద్వాదశ శివాలయాలు అని పిలుస్తారు…

ద్వాదశ శివాలయాలు
గోకర్ణానికి మహాబలేశ్వర ఆలయం , తాలిపరాంబా శ్రీ రాజరాజేశ్వర ఆలయం, కొట్టియూర్ పెరుమాళ్ ఆలయం, త్రిస్సూర్, వడక్కున్నాథ ఆలయం , పేరువనం మహాదేవ ఆలయం , కొడునగాల్లోర్ తీరువంచిక్కులయం మహాదేవ ఆలయం, వైకోమ్ మహాదేవ టెంపుల్, ఎట్టుమనూర్ మహాదేవ ఆలయం, కడుథురుతి మహాదేవ ఆలయం, చెంగన్నూర్ మహాదేవ ఆలయం, కండీయూర్ మహాదేవ ఆలయం సుచింద్రం స్తనుమాలయ పెరుమాళ్ ఆలయాలు ప్రత్యేకం

రాజరాజేశ్వరస్వామి ఆలయం విశిష్టత
ఈ ఆలయం చతురస్రాకార గర్భగుడిలో రెండు అంచెల పిరమిడల్ పైకప్పు ఉంది. గర్భగుడి ముందు నమస్కార మండపం కూడా ఉన్నది. కేరళలోని ఇతర దేవాలయాలకు భిన్నంగా ఈ ఆలయానికి ధ్వజస్తంభం లేదు. బలిక్కల్‌కు పైకప్పు లేదు, కానీ విచిత్రమైన ముఖంతో మర్మమైన వ్యక్తితో అలంకరించి ఉంటుంది. బలిక్కల్ ముందు పిరమిడల్ పైకప్పు ఉన్న ఒక చిన్న దీర్ఘచతురస్రాకార భవనం ఉంది, ఇది సాధారణంగా మరెక్కడా కనిపించదు.

శ్రీరాముడి నమస్కార మండపం
ఈ ఆలయంలో గర్భగుడి సమీపంలో నమస్కారం మండపం ఉంటుంది. శ్రీ రాముడు రావణుడి సంహారం అనంతరం లంక నుంచి అయోధ్యకు తిరిగి వెళుతుండగా శ్రీ రాజ రాజేశ్వర స్వామిముందు సాష్టాంగ నమస్కారం చేసి అయోధ్యకు ప్రయాణం కొనసాగించాడు. శ్రీ రాముని గౌరవంగా ఈ నమస్కార మండపంలో ఎవరినీ అనుమతించరు. కేవలం దేవాలయాలంలో పనిచేసే పూజారులు మాత్రమే ఈ మండపంలో అడుగుపెడతారు.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..