80 ఇంటర్వ్యూలిచ్చిన మోదీ, రాహుల్ ఎన్నో తెలుసా….

ప్రధాని మోదీ అంటే ఒక ఎనర్జీ. 24 గంటలు పనిచేసే ఒక అలుపెరుగని యంత్రం. ప్రజల కోసమే అహరహం ఆలోచించే నాయకుడు. నిత్యం జనంలో ఉండాలని కోరుకునే తత్వవేత్త. తనపై వచ్చిన ఆరోపణలను సున్నితంగా తోసిపుచ్చి జనానికి కావాల్సిందేమిటో చేయగల సమర్థుడు.జనంతో కనెక్టు అవుతూ వారి సమస్యలు తీర్చగల దిట్ట….

ప్రతీ ఇంటర్వ్యూ ఒక హైలైట్..

ప్రధాని మోదీ మీడియాకు దూరంగా ఉంటారని, మీడియా ప్రతినిధులను దగ్గరకు రానివ్వరని కొంత మంది ఆరోపిస్తుంటారు. ప్రజల కోసం ఆయన చేస్తున్న మంచి పనులను పక్కన పెట్టి ఆయనకు అపవాదులు ఆపాదించేందుకే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారందరికీ తిరుగులేని ఎదురు సమాధానాన్ని ఈ సారి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఇచ్చేశారు. ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు 80 ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ప్రతీ మీడియా ప్రతినిధితో విస్తృతంగా మాట్లాడేశారు. కమ్యూనికేషన్ అంటే ఏమిటో చెప్పేశారు. ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరించారు. పాకిస్థాన్ పై దాడుల వ్యవహారం ఒకసారి, పాక్ నేతలకు – కాంగ్రెస్ కు మధ్య సంబంధాలపై మరోసారి.. దేశ ఆర్థిక ప్రగతిపై మూడో సారి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. దేశ ప్రజలను ఆలోచింపజేశారు.

ఒక ఇంటర్వ్యూతో సరిపెట్టిన రాహుల్…

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ఈ సారి మోదీ దూకుడుతో ఆయన భయపడిపోయారు. కేవలం ఒక ఇంటర్వ్యూతో సరిపెట్టారు. పైగా ఎవరైనా ఇంటర్వ్యూ అడిగినా వద్దు వద్దంటూ కాంగ్రెస్ నేతలు భయపడి పారిపోతున్నారు. ఒక విస్తృత స్థాయి ప్రెస్ మీట్ కు ఆహ్వానం పంపి కూడా తర్వాత రాహుల్ గాంధీ దాన్ని రద్దు చేసుకున్నారు. డైరెక్ట్ కమ్యూనికేషన్ అంటేనే ఇప్పుడు రాహుల్ గాంధీ వెనుకాడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి…

ప్రాంతీయ మీడియాతో సైతం మోదీ మాటామంతీ..

అడిగిన వారికి లేదనకుండా మోదీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో మాట్లాడారు. ప్రాంతీయ వార్తా ఛానెళ్ల ప్రతినిధులను ఢిల్లీ పిలిపించుకుని అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మీడియా ఇంటర్వ్యూలు కమ్యూనికేషన్ కు మంచి వాహకాలని బీజేపీ విశ్వసిస్తోంది. దీని వల్ల నాయకుడి ఇమేజ్ పెరుగుతుందని కూడా వాదిస్తుంది. పైగా ప్రశ్నలకు మోదీ సమాధానమిచ్చే తీరు కూడా ఆకర్షణీయంగానూ, సందేశాత్మకంగానూ ఉంటుందని చెప్పక తప్పదు. మోదీ మీడియాతో మాట్లాడినట్లుగా కాకుండా, జనంతో మాట్లాడినట్లుగా ఉంటుంది. ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన విసుగు విరామం లేకుండా సమాధానమిస్తున్నారు. పైగా కాంగ్రెస్ వాళ్లు తన ఇంటర్వ్యూలపై ఆరోపణలు చేస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కు మోదీ జవాబుదారీ కాదు. దేశ ప్రజలకు మాత్రమే ఆయన జవాబుదారీ అని మరిచిపోకూడదు..