వై నాట్ బీజేపీ – ఏపీలో వినిపించబోయే స్లోగన్ ఇదేనా !?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు మంచి జోష్ లో ఉన్నారు. ఇద్దరు అగ్రనేతల పర్యటనలు భారీ విజయం సాధించడమే కాదు.. పూర్తి స్థాయిలో ప్రజల్లో తమకు సానుకూల భావన ఏర్పడిందన్న వాతావరణం కనిపించడం కూడా దీనికి కారణం.. రెండు ప్రాంతీయ పార్టీలు వై నాట్ 175 అంటూ రాజకీయాలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రజల నుంచి వై నాట్ బీజేపీ అనే స్లోగన్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతున్న రాజకీయంతో ఇది అసాధ్యమేమీ కాదని బీజేపీ రాష్ట్ర నేతలు కూడా నమ్మకానికి వస్తున్నారు.

విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ

ఏపీ బీజేపీ నేతలు ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి.. ప్రతీ రోజూ ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారు. గతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పెట్టి ప్రజా సమస్యలపై స్పందించారు. తాజాగా.. ఇంటింటికి వెళ్లి ప్రధాని మోదీ పాలనా విజయాలను ప్రచారం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజల వైపు ఉంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోపు బీజేపీ నేతలు ప్రజాపోరు లాంటి కార్యక్రమాలు చేపట్టి మంచి జోష్ గా ముందుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

బీజేపీ, వైసీపీ ఒకటే అనే దుష్ప్రచారానికి తెర పడినట్లే

ఏపీ బీజేపీపై ఇంత కాలం వైసీపీ ఓ భారీ కుట్ర చేసింది . ఏపీ బీజేపీ నేతలు ఎంత పోరాడుతున్నా .. తాము తాము ఒకటే అనే అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నించింది. కీలకమైన పోరాటాలు చేసినప్పుడు జగన్ ఢిల్లీ వెళ్లి అగ్రనేతలతో సమావేశమై…. వాటికి ప్రచారం రాకుండా చేసేవారు. ఇలాంటి కుట్రలన్నింటికీ అగ్రనేతల ప్రచారం తర్వాత తెరపడినట్లయింది. ఎలా చూసినా ఇప్పుడు బీజేపీ, వైసీపీ ఒక్కటే అని చెప్పుకునే చాన్స్ ఉండదు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రచారాన్ని తిరస్కరించడానికి అవకాశం ఉంది.

ఏపీలో వై నాట్ బీజేపీ !

ప్రాంతీయ పార్టీలు మార్చి మార్చి అధికారం మార్చుకోవడానికి కుట్రలు చేసుకుంటున్నాయి కానీ ఇతర జాతీయ పార్టీలు మాత్రం రాకూడదనుకుంటన్నాయి. కానీ ఈ కుట్రలన్నింటినీ చేధించడం ఖాయమైపోయిందని ఏపీ బీజేపీ నేతలంటున్నారు . ప్రజలే స్వచ్చందంగా వై నాట్ బీజేపీ అనే వాతావరణం ఏర్పడుతోందని ధీమాగా ఉన్నారు. ఒక్క సారి బీజేపీ అగ్రనేతలు దృష్టి పెడితే.. ఎలా బీజేపీ బలోపేతం అవుతుందో చూపిస్తామని అంటున్నారు.