కిరణ్‌కు చేరికల టాస్క్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్…!

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అగ్రనేతలు వరుసగా రెండు రోజుల పాటు నిర్వహించిన సభలు విజయవంతం కావడంతో పాటు రాష్ట్ర నేతలకు … కొన్ని టాస్క్‌లను హైకమాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తో జేపీ నడ్డా, అమిత్ షా ప్రత్యేకంగా మాట్లాడారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో బీజేపీ బలోపేతం కోసం వివిధ పార్టీల నేతల్ని చేర్చుకునే దిశగా ప్రయత్నించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ దిశగా కిరణ్‌కు కొన్ని బాధ్యతలు ఇచ్చారని చెబుతున్నారు.

ఇప్పటికే చేరికల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న కిరణ్

కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ బీజేపీ బలోపేతం కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో ఆయన అనుచరులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే జైసమైక్యాంధ్ర పార్టీ వైఫల్యం తర్వాత రాజకీయ భవిష్యత్ కోసం ఎక్కువ మంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. కొంత మంది సొంత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వారందరూ మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డితో టచ్‌లోకి వచ్చారు. వారిని బీజేపీలో చేర్చేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను కిరణ్ కుమార్ రెడ్డిని ఖరారు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

నెలలో ఏపీ బీజేపీలో భారీ చేరికలు ?

కిరణ్ సంప్రదింపులతో ఒకే సారి భారీగా చేరికల కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొంత మంది మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నాయకత్వం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తి స్థాయిలో స్వేచ్చ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎవర్నీ అయినా ఆహ్వానించవచ్చు.నని వర్గ పోరాటాలకు అవకాశం ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరాలని అనుకున్నారు కానీ వారికి సరైన ఫ్లామ్ దొరకలేదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో వారందరికీ ఓ దారి కనిపించినట్లయింది .

చేరికల విషయంలో బీజేపీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి

ఒక్కొక్కరుగా కాకుండా పెద్ద ఎత్తున మాజీ ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంలో మంచి ముహుర్తం చూసుకుని చేరికల కార్యక్రమాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. అక్కడక్కడ మిగిలి ఉన్న నేతలు పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు. ఏపీలో ఎలాగూ భవిష్యత్ లేదు… దేశ స్థాయిలో అయినా ఉంటుందనుకుంటే అలాంటి ఆశలు కూడా కనిపించకపోవడంతో వారంతా ప్రత్యామ్నాయం చూసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్ అధ్యక్షుడ్ని మార్చారు. ఏ మాత్రం ప్రజల్లో పలుకుబడి లేని నేతను నియమించడంతో గతంలో ప్రజాప్రతినిధులుగా గెల్చిన వారు అసంతృప్తికి గురయ్యారు. వారంతా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.